TTD News : ఎస్వీబీసీ ఛానల్ ప్రక్షాళన కు అధ్యయన బృందం

ఎస్వీబీసీ ఛానల్ ప్రక్షాళన కు అధ్యయన బృందం
తిరుపతి - ప్రభాత సూర్యుడు
తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానంతో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంస్థను మరింత పటిష్టవంతంగా తీర్చిదిద్ది, భవిష్యత్తులో భక్తి ఛానల్ లకు మార్గదర్శకంగా ఉండేలా రూపురేఖలు మార్చేందుకు ప్రణాళిక సిద్ధమైంది. కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నప్పటికీ క్వాలిటీ లేని కార్యక్రమాలతో భక్తులను సరైన రీతిలో ఆకట్టుకోలేక పోతున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న ఎస్వీబీసీ ఛానల్ ను గాడిలో పెట్టేందుకు ప్రత్యేకంగా అనుభవజ్ఞులు నిపుణుల చేత విచారణ జరిపి ఒక నివేదిక అందించాలని టిటిడి పాలకమండలి ఆదేశించింది.
ఈ మేరకు ఢిల్లీ, హైదరాబాదుల నుండి ఒక ప్రత్యేక నిపుణుల బృందం ఇప్పటికే తిరుపతికి చేరుకుంది. మూడు రోజులపాటు తిరుపతి తిరుమల లో బసచేయనున్న ఈ ప్రత్యేక కమిటీ సభ్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో అమలవుతున్న కార్యక్రమాలు, పరిపాలన వ్యవహారాలు, సిబ్బంది పనితీరు, కార్యక్రమాల రూపకల్పన, ప్రసారం చేస్తున్న కార్యక్రమాలలో నాణ్యత, భక్తి కార్యక్రమాల పేరుతో ఖర్చు చేస్తున్న నిధుల సద్వినియోగం, సిబ్బంది విధి నిర్వహణ తీరు వ్యవహారాలు, తదితర అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి టీటీడీ బోర్డుకు నివేదిక అందించనున్నారు. పలు జాతీయ టీవీ ఛానల్ నిర్వహణ వ్యవహారాలు పై మంచి అనుభవం కలిగిన నిపుణులను ఈ అధ్యయనానికి నియమించినట్లు టిటిడి వర్గాలు వెల్లడించాయి.
గత వైసిపి ప్రభుత్వ హయాంలో టీటీడీలోని కీలక అధికార పదవులు అన్నింటిని సర్వం తానే అని వ్యవహరించిన అధికారి ఎస్ వి బి సి ఛానల్ కు కూడా తానే అధిపతిగా భావించి దాతలు టీటీడీకి అందించిన కోట్లాది రూపాయల నిధులను పక్కదారి పట్టించి ఎస్వీబీసీ ఛానల్ లో కార్యక్రమాల ఖర్చు పేరుతో నిధులను దారి మళ్లించినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనున్నారు. నూతనంగా అందనున్న నివేదిక ప్రకారం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ రూపు రేఖలను మార్చడంతో పాటు జాతీయస్థాయిలో ఛానల్ కు గుర్తింపు తీసుకొచ్చి, నిధుల వినియోగంలో దుర్వినియోగాన్ని అరికట్టి, ప్రభుత్వం నుండి ఛానల్ నిర్వహణ కోసం అనుభవం కలిగిన పర్యవేక్షకులను నియమించేలా టిటిడి బోర్డు కీలకమైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది.