Ration Distribution : 3 నెలల రేషన్ ఇంకా తీసుకోలేదా?.. మీకో బిగ్ అలర్ట్.. గుడ్ న్యూస్..!!
టెన్షన్ పడకండి..ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రేషన్ షాపులు పని చేస్తాయి
.jpeg)
హైదరాబాద్ - ప్రభాత సూర్యుడు
తెలంగాణలో మూడు నెలల రేషన్ ఒకేసారి ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని చోట్ల స్టాక్ లేకపోవడంతో సమస్యలు తలెత్తాయి. రేషన్ అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
రేషన్ పంపిణీ గడువు ముగిస్తే.. ఇక రేషన్ తీసుకోలేమేమోనని కంగారు పడుతున్నారు. ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రేషన్ పంపిణీ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
3 నెలల రేషన్ సన్న బియ్యం పంపిణీ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరికీ జూన్ 30వ తేదీలోపు వారి కోటా పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. 3 నెలల స్టాక్ అందుబాటులో ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రేషన్ షాపులు పని చేస్తాయన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చౌక ధరల దుకాణాలు తెరిచే ఉంటాయని అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో దాదాపు 48శాతం కార్డుదారులకు 3 నెలల రేషన్ సరుకులను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి కార్డుదారునికి రేషన్ సరుకులు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా జరిగేలా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. కార్డుదారులు రేషన్ బియ్యాన్ని ఎవరికైనా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బియ్యం విక్రయించిన వారు పట్టుబడితే కార్డు రద్దు చేయడంతో పాటు వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
వర్షా కాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 3 నెలల రేషన్ ను జూన్ లోనే పంపిణీ చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. కేంద్రం సూచనలతో తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల రేషన్ ఒకేసారి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. జూన్, జూలై, ఆగస్ట్ కోటా సన్న బియ్యాన్ని ఈ నెలలోనే పంపిణీ చేస్తోంది. బయోమెట్రిక్ ద్వారా నెలనెలకు ధ్రువీకరణ వేర్వేరుగా చేయాలని అధికారులు సూచించారు.